హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై రాళ్లు వేసింది ఎవరో? దాని వెనక దాగి ఉన్న కుట్ర ఏమిటో బయటపెట్టేందుకు సీఐడీతో సమగ్ర విచారణ చేపట్టాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై రాళ్లు వేసిన ఘటనలో ఎంత నిజం ఉన్నదో అంతే అబద్ధం ఉన్నదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల సానుభూతి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బండి ఇదే తరహాలో సానుభూతి ఓట్లు పొందేందుకు స్ట్రోక్ వచ్చిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలకు అబద్ధాలు మాట్లాడం అలవాటేనని, ఎర్రకోట నుంచి మోదీ చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. బండి సంజయ్ తన పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని డిమాండ్చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్చేశారు.