కురవి, డిసెంబర్ 31: బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది. చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఆటోడ్రైవర్లు ఆటోలో కురవికి బయల్దేరారు. ఈ క్రమంలో క్వారీకి చెందిన పెద్ద బండరాళ్ల లోడ్తో మరిపెడ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఆటోను ఢీకొన్నది. ఈ ఘటనలో లారీలోని బండరాళ్లు రోడ్డుపై పడటంతో ఆటోలోని బానోత్ సుమన్ (35), యాకాలపు శ్రీకాంత్ (37) బండల కిందపడి చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన డెంక్యాల నవీన్ (38)ను వరంగల్లోని ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. గాయపడిన లింగంపల్లి రాంబాబు, బానోత్ రాము, బానోత్ రమేశ్, నునావత్ వీరన్న, బొడ్డు శేఖర్ను పోలీసులు మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు. మంత్రి సత్యవతిరాథోడ్ దవాఖాన సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత క్షతగాత్రులను పరామర్శించారు.