నిర్మల్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)/ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మేస పోసానితోపాటు ఆమె కొడుకు మేస సలేష్ రెండు రోజులుగా కనిపించడం లేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అపహరించుకొని పోయారని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలోనే ఈ అపహరణ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగి 50 రోజులు అవుతున్నా ఖానాపూర్లో మున్సిపల్ పాలకవర్గం ఏర్పడలేదు. ఇందుకు ప్రధాన కారణం ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ (7 స్థానాలు) దక్కకపోవడం. ఏ రెండు పార్టీలు పొత్తుకు ముందుకు రాకపోవడమేనని అంటున్నారు. దీంతో ఫిబ్రవరి 16న పూర్తి కావాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఇక్కడి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 4 వార్డులు, బీజేపీ 4 వార్డుల్లో గెలుపొందగా, 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి సాజీదాబేగం గెలుపొందగా, ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో మూడు పార్టీల బలాలు సమానమయ్యాయి. చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (7 స్థానాలు) మాత్రం ఏ పార్టీకి లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఖానాపూర్ మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇక్కడి సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు తమకున్న అధికార బలంతో అక్రమాలకు తెరలేపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.