హైదరాబాద్ : ఈ ఏడాది ఆగస్ట్ నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్ల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డెయిరీ, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్లాంట్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల ప్రగతిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ ఇంజినీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పనులను మరింత వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పాడి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా విజయ డెయిరీ నష్టాల పాలై మూసివేసే దశకు చేరుకుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్న పాడి రంగం అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అందులో భాగంగా పాడి రైతులకు అనేక రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఫలితంగా నష్టాలలో ఉన్న విజయ డెయిరీ నేడు రూ.700 కోట్లలకు పైగా టర్నోవర్కు చేరిందని చెప్పారు. తార్నాకలోని లాలాపేటలోని డెయిరీ ప్లాంట్ చాలా కాలం కిందట నిర్మించినది కావడంతో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నూతన డెయిరీ ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
ఎంతో ఆదరణ ఉన్న విజయ డెయిరీ పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, స్వీట్ లస్సీ, మజ్జిగ, నెయ్యి, వెన్న, పన్నీర్, దూద్ పేడ, మైసుర్ పాక్, కోవా, బాసుంది, ఐస్ క్రీములు వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పుణే, ముంబయి తదితర ప్రాంతాల్లో విజయ నెయ్యికి ఎంతో డిమాండ్ ఉందని చెప్పారు. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా పాడి రైతులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సన్న, చిన్నకారు రైతులకు మహిళా పాల ఉత్పత్తిదారులకు పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు, నాబార్డ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సంఘాల పరిధిలో పాడి రైతులకు రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో పర్యాటక ప్రాంతాలు, హైవే లు, ప్రముఖ దేవాలయాలు తదితర ప్రాంతాలలో నూతనంగా 2వేల డెయిరీ ఔట్ లెట్లులు, మొబైల్ ఔట్ లెట్లను ప్రారంభించినట్లు వివరించారు. మంత్రి వెంట ఎన్డీడీబీ ఇంజినీరింగ్ విభాగం జీఎం సునీల్ సిన్హా, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.