హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్భవన్లో టీ9-30 టికెట్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్పదూరం ప్రయాణించే వారి కోసం ‘టీ9-30 టికెట్’ను తీసుకొచ్చినట్టు తెలిపారు. గురువారం నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఈ టికెట్ ద్వారా ఒక్కొకరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని, ఈ టికెట్ తీసుకొన్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబో టికెట్ తీసుకొని ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చని చెప్పారు.
పురుషులకూ ‘టీ9-60 టికెట్’ వర్తింపు
టీ9-60 టికెట్ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్టు బాజిరెడ్డి, సజ్జనార్ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన ఈ టికెట్ను 27 నుంచి పురుషులకు కూడా వర్తింపజేయనున్నట్టు చెప్పారు.