TS Cabinet Meeting | ఈ ఏడాది జూన్ 2వ తేదీలోగా సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నాలకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోగా.. వివరాలను మంత్రి హరీశ్రావు మీడియాకు వివరించారు. ప్రస్తుతం సెక్రటేరియట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రారంభానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. పనులు పూర్తి కాగానే మంచి రోజున సెక్రటేరియట్ అత్యద్భుతంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు.
అలాగే అమరవీరుల స్థూపం పనులు సైతం దాదాపు పూర్తికావొచ్చాయని, మంత్రి ప్రశాంత్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దాదాపు నెల నెలన్నర రోజుల తేడాలో వ్యవధిలో
అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ సెక్రటేరియట్, అమరవీరుల స్మారక క్షేత్రం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఆయన జన్మదినం రోజున పండుగ వాతావరణంలో విగ్రహాన్ని ఆవిష్కరించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, అమరవీరుల స్మారక కేంద్రం, సెక్రటేరియట్ ప్రారంభ తేదీలను త్వరలోనే నిర్ణయించి.. జూన్ 2లోగా మూడింటిని ప్రారంభోత్సవం పూర్తి చేసుకుంటామని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏ రోజైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి మే వరకు సమయం ఉందని, కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నివేశన స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం పని చేస్తుందని, ప్రస్తుతం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను.. నిరుపేదలకు అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గృహలక్ష్మి కింద సొంత స్థలం ఉండి.. ఇండ్లు లేని వారి కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. రెండు కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతూనే ఉంటాయన్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తామన్నారు. కేంద్రం కొన్నా.. కొనకపోయినా.. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి, రైతుబిడ్డ అని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి.. పూర్తి చేస్తామన్నారు.