హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్ సీసీనగర్లో రూ.20.64కోట్లతో నిర్మించిన 264 డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన శుక్రవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి పెట్టిన ఖర్చు ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా పెట్టలేదని చెప్పారు. రూ. 18 వేల కోట్ల భారీ బడ్జెట్తో పేదల సొంతింటి కలను నిజం చేశామని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది సీఎం కేసీఆర్ విజన్ అని తెలిపారు. ఇప్పటివరకు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని, అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసి పేదలందరికీ అందిస్తామని పేర్కొన్నారు. ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదని, ఈ రెండు ఎంతో కష్టంతో కూడుకున్నవని చెప్పారు. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. నగరంలో నిర్మించిన ఇండ్లకు మార్కెట్ విలువ రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని, కానీ సీఎం కేసీఆర్ ఒక్కపైసా కూడా భారం వేయకుండా పేదలకు అందిస్తున్నారని చెప్పారు. దళారులకు, పైరవీలకు అవకాశమే లేదని, అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మం త్రులు మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, కార్పొరేటర్లు కుర్మ హేమలత, కొలన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.