BR Ambedkar Secretariat | తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర క్షణాలివి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిలబెట్టుకుంటున్న మధుర ఘట్టమిది. ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణకు మాత్రమే సాధ్యమన్న రీతిలో అద్భుత కట్టడం.. ప్రపంచం ముందు తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ పట్టుదల, అకుంఠిత దీక్షకు మరో తార్కాణం.
అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధాన్ని ఆదివారం మధ్యాహ్నం సింహలగ్న ముహుర్తంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయ ప్రధాన ద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో అంతస్తులోని తన చాంబర్లో కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మంత్రులు కూడా తమ ఛాంబర్లలో కొలువుదీరి పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.
ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఉన్నవి. ఒకటి పర్ క్యాపిట ఇన్కం. రెండోది పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో ముందున్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దేశంలోనే నంబర్ వన్ స్థాయికి పర్ క్యాపిటలో ముందున్నాం. పవర్ యుటిలైజేషన్లో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. సచివాలయం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటుంది తెలంగాణ. అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు. గత డీజీపీలు అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి అద్భుతంగా పని చేశారు. ప్రస్తుత డీజీపీ అజంనీ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలకు భరోసానిస్తూ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ పని చేస్తున్నాయి. అరాచక ముఠాలను నివారిస్తున్నాం. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోతున్నాం. పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ విధానంలో బెంగళూరును దాటి పోతున్నాం.
వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. కరెంట్ షాక్లతో రైతులు చనిపోయారు. కానీ నేడు 24 గంటల కరెంట్తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నాం. హరితశోభను వెదజల్లుతున్నాయి. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్లోని గోండు ప్రజలు కూడా తాగుతున్నారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక చర్చలు మనం చూశాం. పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారు. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని మరగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకున్నాం. పునర్నిర్మాణం అంటే వచ్చిన నీటిని కోల్పోయిన చెరువులను పునర్నిర్మాణం చేసుకున్నాం. జీవనదులు, ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి. గోదావరి నది ఎప్పుడు దాటినా అక్కడ చిల్లర డబ్బులు వేసి దండం పెట్టేవాడిని. మా పొలాలు ఎప్పుడు పండిస్తావని అడిగేవాడిని. తెలంగాణ ఇంజినీర్లు చేసిన అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది పునర్నిర్మాణం అంటే మనవి చేస్తున్నా.
సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాం. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నాం. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నాం.
తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. నీళ్లు రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉంది. అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైంది. అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు, సీఎస్ నుంచి గ్రూప్ -4 ఉద్యోగుల వరకు అందరికీ నమస్కరిస్తున్నా.
నూతన సచివాలయంలో 2వ అంతస్తులోని తన ఛాంబర్లో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి తలసాని దంపతులు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన దస్త్రంపై మంత్రి తలసాని తొలి సంతకం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో 4వ అంతస్తులోని తన ఛాంబర్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే దస్త్రంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే దస్త్రంపై కూడా సంతకం చేశారు.
నూతన సచివాలయంలో ఒకటో అంతస్తులో తన ఛాంబర్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ. 34.25 కోట్లతో ట్యాబ్లను, 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్లను రూ. 7.53 కోట్లతో ఏర్పాటు చేసే దస్త్రాలపై సబితా ఇంద్రారెడ్డి తొలి సంతకం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కీలక దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ మొదటి సంతకం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేసీఆర్ ఎలాంటి హడావుడి లేకుండా నిరాడబంరంగా మూడో అంతస్తులోని తన ఛాంబర్లోకి వెళ్లి ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలపై కేటీఆర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ అధికారులు శుభాకాంక్షాలు తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రశాంత్ రెడ్డి. అంతకు ముందు తన ఛాంబర్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
సచివాలయంలోని ఆరో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా శాంతి కుమారి రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆయా శాఖల ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది సీఎస్కు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రి హరీశ్రావు తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. రెండో అంతస్తులోని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ఛాంబర్లో హరీశ్రావు ఆసీనులై.. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో నెంబర్ అంటే ఎంతో ప్రత్యేకత. సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో ఆసీనులైన సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు కేసీఆర్. ఈ ఆరు దస్త్రాలపై సుముహుర్తంలోనే సంతకాలు చేశారు సీఎం.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఛాంబర్లో ఆసీనులైన సందర్భంగా యాదాద్రి ఆలయానికి సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకంతో పాటు కవిత నీరాజనం పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత యాదాద్రి లడ్డూను కేసీఆర్కు అందించారు.
సచివాలయం ఆరో అంతస్థులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసీనులయ్యారు. అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కేసీఆర్కు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు శుభకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి సచివాలయంలోకి ప్రవేశించారు. కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఇంజినీర్లు ఉన్నారు.
యాగశాల నుంచి నేరుగా సచివాలయం ప్రధాన ద్వారానికి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
నూతన సచివాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యాగశాలను సీఎం కేసీఆర్ సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు కేసీఆర్ కాన్వాయ్ సచివాలయానికి చేరుకుంది. సీఎం కేసీఆర్ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మరికాసేపట్లో సచివాలయం ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లనున్నారు.
దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ల నుంచి భవన ప్లాన్లను ఆహ్వానించిన ఆర్ అండ్ బీ శాఖ, చివరకు ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్స్ను సచివాలయానికి కన్సల్టెంటుగా నియమించింది. మరోవైపు ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి రూ.617 కోట్లు మంజూరు చేస్తూ సెప్టెంబర్ 10, 2020న ఉత్తర్వులు జారీచే సింది. ఆర్కిటెక్ట్ సంస్థ సమర్పించిన ప్లాన్ ఆధారంగా భవనాన్ని నిర్మించాలని ఆర్ అండ్ బీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ పనులు దక్కించుకొన్నది. ఎయిర్పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పను లు ప్రారంభించారు. ఈ ఏప్రిల్ నెలాఖరుకు 26 నెలలు పూర్తవుతున్నది. ఆర్ అండ్ బీ శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సి ల్), టీఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో లోపం లేకుండా భవనాన్ని నిర్మించింది.
కొన్ని రాళ్లు, నాలుగు ఇటుకలు, కొంచెం సున్నం, సిమెంటు కలిపితే అద్భుత కట్టడం కాదు. ఏ నిర్మాణానికైనా ఒక ఆత్మ ఉండాలి. ఆ తత్వాన్ని ప్రతిబింబించే పథకం ఉండాలి. దానికి సరైన కొలతలు తోడవ్వాలి. అప్పుడే ఒక అద్భుత సౌధం నిలబడుతుంది. ఇదే విషయాన్ని 5 లేక 7 వ శతాబ్దంలో క్రోడీకరించిన ప్రాచీన భారత నిర్మాణ శాస్త్ర గ్రంథం ‘మానసార’ వివరిస్తుంది. నిర్మాణంలో పాటించాల్సిన కొలతలు, నిష్పత్తులు, డిజైన్ల గురించి చెపుతుంది. ఈ వ్యాసం రాస్తున్న క్రమంలో మాట్లాడిన కొందరు ఆర్కిటెక్టులు మెచ్చుకున్న అంశం ఈ నిర్మాణం స్కేల్ (స్థాయి) గురించి. 265 అడుగుల ఎత్తైన నిర్మాణం సుమారు పదిన్నర లక్షల అడుగుల్లో పరుచుకుని ఉన్నప్పుడు, భవనం ఈస్థటిక్ సెన్స్ చెడకుండా వివిధ అంతస్తులుగా, గదులుగా నిర్మించడం ఒక కష్టసాధ్యమైన పని. షాపుర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ తరఫున నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఒక అధికారి ‘ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో పడ్డ కష్టాలు, మాకు ఆర్కిటెక్చర్లో కొత్త పాఠాల్ని నేర్పాయి’ అన్నారు.
ఆధునిక భవనం ప్రకృతిలో భాగమైయినప్పుడే దానికి సార్థకత, ఉపయోగిత్వం ఉంటుంది. అందుకే ఈ భవనాన్ని ఒక ’గ్రీన్ బిల్డింగ్’గా రూపొందించారు. అన్ని అంతస్తుల్లో తలుపులు, కిటికీలు ఒకే వరుసలో ఉండేలా డిజైన్ చేసినందున గాలి ప్రవాహం నిరాటంకంగా సాగుతుంది. సెక్రటేరియట్ పైకప్పు మీద పడ్డ ప్రతీ వాన చుక్కా భూగర్భంలో ఉన్న నీటి సంపులోకి చేరి మొత్తం పరిసరాల్లో ల్యాండ్ స్కేపింగ్కు, పచ్చదనం పెంచేందుకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఈ భవనానికి గోల్డెన్ సర్టిఫికెట్ ఇచ్చింది.
క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలోనే రోమన్ ఆర్కిటెక్ట్ విట్రూవియస్ వాస్తుకళ గురించి తన గ్రంథం ‘డీ ఆర్కిటెక్చురా’ లో, ప్రతీ నిర్మాణానికి దృఢత్వం, ఉపయోగం, అందం అనే మూడు లక్షణాలు ఉండాలని రాశాడు. ఈ మూడు లక్షణాల్ని మిళితం చేసుకుంది సెక్రటేరియట్ భవనం. ఈ భవన నిర్మాణంలో అనుభవజ్ఞులైన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ఆధునిక సాంకేతికత వాడటం, అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటించడం దృఢత్వాన్ని గ్యారంటీ చేస్తున్నది. కనీసం 150 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా ప్లాన్ చేసినారు. లక్షల చదరపు అడుగుల గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సహాయంతో డోమ్లు, పిల్లర్లను అదీ అతి తక్కువ సమయంలో నిర్మించడం సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమే. అంతెందుకు సచివాలయ ముఖద్వారాన్ని ఎలివేట్ చేయడం కోసం ఎన్నో ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది.
ఇక సచివాలయంపై ఉన్న గుమ్మటాల గురించి చెప్పుకోవాలి. వాస్తుకళలో ఒక విశిష్టమైన అంశం గుమ్మటం (ఇంగ్లీషులో డోమ్ అంటారు). బౌద్ధ స్తూపాల పైనుండే అండం, ప్రాచీన రోమన్ కట్టడాల్లో ఉండే డోమ్లు, మధ్య యుగాల్లో భారత ఉపఖండంలో ఎదిగిన ఇండో-పర్షియన్ నిర్మాణాల్లో ఉండే గుంబద్లు, తెలుగులో చెప్పుకునే గుమ్మటాలు – పేరు ఏదైనా స్వల్ప మార్పులతో ఇవన్నీ ఒక్కటే. నిర్మాణాన్ని ఎలివేట్ చేయడమే వీటి ముఖ్య లక్షణం. వరాహమిహిరుడి బృహత్సంహితలో షోడశాండయుక్త అనే ప్రస్తావన ఉంది. దీని అర్థం 16 అండాలు లేక గుమ్మటాలు. అంతేకాదు దాదాపు 84 గుమ్మటాల వరకూ ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటి నిర్మాణశైలిని బృహత్సంహితలో వివరించారు.
ఆర్కిటెక్ట్స్ అయిన ఆస్కార్ కన్సెస్సో, పొన్ని కన్సెస్సో మాటల్లో చెప్పాలంటే, ఈ భవనం మీది గుమ్మటాలకు ప్రేరణ గుజరాత్లోని సాలంగపూర్ హనుమాన్ దేవాలయం, నిజామాబాదు నీలకంఠేశ్వర ఆలయ గుమ్మటాలు. ఇవి కేవలం ఆలయ గుమ్మటాల లక్షణాన్ని మాత్రమే కాకుండా, ఇండో-సార్సెనిక్ వాస్తు లక్షణాల్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇండో-సార్సెనిక్ వాస్తు కళను ఇండో-గోతిక్ లేదా మొఘల్-గోతిక్, లేదా 19వ శతాబ్దపు మిశ్రమ హిందూ శైలి అనవచ్చు. అందుకే బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని కట్టడాల్ని, సంస్థానాల్లోని రాజ ప్రాసాదాల్ని ఈ శైలిలో నిర్మించినారు. అందుకు ఉదాహరణే వనపర్తి రాజ ప్రాసాదం. సెక్రటేరియేట్ భవనం డిజైన్కు ఈ వనపర్తి రాజభవనం ఒక రిఫరెన్స్ పాయింట్ కూడా. సచివాలయం మీదున్న 34 గుమ్మటాల్లో 2 పెద్దవి. వీటి మీద 15 మీటర్ల పొడవైన జాతీయ చిహ్నం గంభీరంగా నిలిచి ఉంటుంది. కంచుతో పోత పోసిన నాలుగు సింహాలతో జాతీయ చిహ్నం, పక్కనే అంబేద్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడు ఒక సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సందేశానికి ప్రతీకలు.
భవనానికి ముందు లాన్లో రెండు వైపులా రెడ్ సాండ్ స్టోన్తో కట్టిన ఫౌంటైన్లు, డిజైన్లో ఒక అందమైన చేర్పు. పార్లమెంటు భవనంలో ఉన్న సైజులో, అదే ఆకృతిలో ఉన్నాయి ఈ ఫౌంటైన్లు. ఆకుపచ్చని పచ్చిక బయలు, ఎరుపు రాతి ఫౌంటైన్, దాని నుండి ఎగజిమ్ముతున్న నీరు – ప్రకృతిలోని రంగుల్ని పేర్చి చూపినట్టు ఉంది. ఆదిలాబాద్ కలప తలుపులపై లోహపు డిజైన్లను పొదిగిన తర్కషి కళ తెలంగాణలో పుట్టి పెరిగిన బిద్రీకళను తలపిస్తుంది. భవనం దర్వాజాను బాహుబలి ద్వారం అంటున్నా రు. కోటలోని దర్వాజాలను తలపిస్తూ, తర్కషితో చెక్కిన అందమైన కళాకృతి ఈ ద్వారం.
రాజస్థాన్ నుంచి తెప్పించిన ధోల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ (ఎర్ర ఇసుక రాయి) భవనానికి వైవిధ్యాన్ని అందించింది. భవనంలోని లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లను కవర్ చేస్తూ మందమైన ఈ రెడ్ సాండ్ స్టోన్ వాడకంతో ఉత్తర భారత నిర్మాణ శైలిలో ఉన్న అంశాన్ని కూడా చేర్చినట్టు అయింది. కేవలం కిందే కాదు, భవనం పైభాగంలోనూ ధోల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ను ఒక పట్టీలాగా పరచడంతో అందం మరింత పెరిగింది. ముఖ్యమంత్రి సూచన మేరకు డిజైన్లో పైభాగంలో కూడా ఎర్ర ఇసుక రాయి పట్టీని చేర్చినారు. పేపర్ మీద భవనం డిజైనింగ్ మొదలు, నిర్మాణ సమయంలో అతి సూక్ష్మ అంశాల వరకు కేసీఆర్ గారి దార్శనికత, మార్గదర్శకత్వం అంతర్లీనంగా తమని నడిపించిందని అంటున్నారు ఆర్కిటెక్టులు.
ఆరో అంతస్థులోని గదుల గురించి చెప్పక పోతే భవన సౌందర్యంలో ఒక ముఖ్యమైన అంశాన్ని విస్మరించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి ఛాంబర్, విశిష్ట అతిథులతో సమావేశమయ్యే మందిరం, డైనింగ్ హాల్స్ వంటి నిర్మాణాల్లో ఉన్న తెలుపు, క్రీమ్ మధ్యలో సన్నటి బంగారు రంగు పట్టీలతో ఉన్న కలర్ స్కీం, ఫ్రాన్స్లోని వెర్సెల్లెస్ రాజ భవనంలోని గదుల్ని తలపిస్తున్నాయి.
పాల రాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్ – పేరు ఏదైనా ఒక అందమైన డిజైన్లో ఒద్దికగా ఒదిగిపోతేనే భవనంలో ఒక సింక్రోనీ ఉంటుంది. ఆరవ అంతస్తు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం, సమావేశ మందిరాలు, జనహిత (ప్రజల్ని కలుసుకునే మందిరం), చీఫ్ సెక్రటరీ కార్యాలయం వంటి ముఖ్యమైన ఆఫీసులు ఉంటాయి. పాల రాయి పరిచిన వరండాలు, గదులు ఆరవ అంతస్తు ప్రత్యేకతను చాటుతాయి. మిగిలిన అన్ని అంతస్తుల్లో తెలంగాణలో దొరికే గ్రానైటును ఫ్లోరింగ్కు వాడినారు.
హైదరాబాద్ నగరమే ప్రేమ తత్వం, మిశ్రమ సంస్కృతి పునాదిగా ఏర్పడ్డది. అందుకే ఈ నగరంలో ఏ సాంస్కృతిక విశేషమైనా భిన్నత్వంలో ఉన్న వైవిధ్యాన్ని పట్టి నిలిపింది. అది సాహిత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, వాస్తు, శిల్ప రీతులు కావచ్చు, చివరికి తినే తిండి కూడా భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇప్పుడు రూపు దిద్దుకున్న సెక్రటేరియట్ భవనం, హైదరాబాద్ ఆత్మను ప్రతిబింబిస్తూ దక్కన్-ఇండో పర్షియన్, ఇండో-సార్సెనిక్ వాస్తు రీతుల మేలు కలయికగా రూపొందింది. కాకతీయ వాస్తు రీతి స్పష్టంగా లేకపోయినప్పటికీ, మొత్తం కట్టడంలో అన్ని చోట్లా నిలిపిన డబుల్ పిల్లర్స్కు ప్రేరణ కాకతీయ తోరణంలోని రెండు స్తంభాలు అంటున్నారు ఆర్కిటెక్ట్స్ అయిన ఆస్కార్ అండ్ పొన్ని.
ప్రపంచంలోనే పేరున్నఎన్నో కట్టడాలకు సరితూగే విధంగా ఉంది కొత్త సచివాలయం. 17వ శతాబ్దం నాటి ఫ్రాన్సులోని వెర్సెల్లెస్ ప్యాలస్, 18వ శతాబ్దంలో కట్టిన లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్, వాషింగ్టన్ లోని కాపిటల్ బిల్డింగ్, 20వ శతాబ్దంలో కట్టిన జపాన్, సింగపూర్, సౌత్ కొరియా పార్లమెంట్ భవనాలకు దీటుగా నేటి సచివాలయం నిలుస్తుంది. దేశంలోని ఎన్నో చారిత్రక కట్టడాలు తెలంగాణ సచివాలయం కంటే తక్కువ ఎత్తైనవి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఆగ్రాలోని తాజ్మహల్ కంటే 26 అడుగులు (8 మీటర్లు) ఎత్తు ఉంది ఈ కొత్త భవనం. ఇక హైదరాబాద్లోని ఎత్తైన కట్టడం చార్మినార్ ఎత్తు 183 అడుగులు (56 మీటర్లు) ఉంటే సచివాలయం దాని కంటే 82 అడుగులు (25 మీటర్లు) ఎత్తు ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చట్ట సభలు లేక సచివాలయ భవనాలన్నిటి కంటే ఎత్తైన కట్టడం ఇది. 1950లలోనే కట్టిన కర్ణాటక విధాన సౌధ 175 అడుగుల ఎత్తుంటే, తెలంగాణ సచివాలయం 265 అడుగుల ఎత్తు ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని న యా రాయపూర్ సెక్రటేరియట్, గుజరాత్ సెక్రటేరియట్ కంటే ఎత్తైనది తెలంగాణ సచివాలయం. అంతెందుకు, కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనం ఎత్తు 130 అడుగులు మాత్రమే.
ప్రతీ నిర్మాణానికీ ఒక సందర్భం, సాంస్కృతిక పునాది ఉంటుంది. తెలంగాణ నేల శాతవాహనుల కాలం నుంచి నేటి వరకు ప్రతి చారిత్రక సందర్భంలో తన సంతకాన్ని కళాత్మకంగా చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నేల మీద గర్వంగా నిలిచిన సచివాలయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దార్శనికతకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమంత్రి విజన్ను నేలపై నిలపడంలో ప్రతి రోజూ నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి కనిపిస్తుంది. బీఆర్ అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం, రాజ్యాంగానికీ, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికీ చేసిన చిరు సత్కారం.
భవనం అంటే కేవలం మట్టీ, రాళ్లు, ఇసుక, సిమెంటులతో ఉన్న నిర్మాణం కాదు. కాలం సమకాలీన సమాజంతో చేసే కరచాలనం. వారసత్వపు కళా శైలుల్ని, ఆధునికతతో మేళవించే సన్నివేశం. దక్కన్, తెలంగాణ అస్తిత్వాల్ని భౌగోళిక విశేషంగా చాటుతున్న సందర్భం. అందుకే తెలంగాణ సచివాలయం ఒక అందమైన అస్తిత్వ కేతనం.
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్లో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి మంత్రి కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అడుగు పెట్టనున్నారు. మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలకమైన ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు.
సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహరా కాయనున్నారు. రాత్రీ పగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా వారి సమాచారం ఆధార్ డాటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డాటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేశారు.
సచివాలయం లోపల ప్రత్యేకంగా భద్రతను కల్పించేందుకు సుశిక్షితులైన వంద మందిని నియమించారు. సిటీ పోలీస్ విభాగం నుంచి 50 మంది, రాచకొండ నుంచి 25 మంది, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 25 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వీరితో పాటుగా అదనంగా సిటీ పోలీస్ నుంచి 50 మంది సిబ్బందిని నియమించారు. కేవలం లా అండ్ ఆర్డర్ నుంచే సుమారు 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. సచివాలయంలో లోపల 300 సీసీ కెమెరాలతో పాటు టీఎస్ఎస్పీ, ఆక్టోపస్, ఇతర ఫోర్సుల నుంచి నియమించిన సిబ్బంది విధుల్లో ఉన్నారు.
సచివాలయంలో అద్భుతమైన, సౌకర్యవంతమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్ వస్తువులు అందుబాటులో ఉంచారు. వీటిలో టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, స్టాండ్లు, కప్బోర్డులు, టీపాయ్లు తదితరాలున్నాయి. వివిధ సెక్షన్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, మంత్రులు, సీఎం చాంబర్లు, వారి సిబ్బంది కార్యాలయాలు, సీఎస్ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారుల పేషీలకు కలిపి 1,880 టేబుళ్లు, 4,886 కుర్చీలు వేశారు. మంత్రులకు 23 చాంబర్లు ఏర్పాటు చేశారు. 26 కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మరో 4 కాన్ఫరెన్స్ హాళ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలోని ప్రతీ ఫ్లోర్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు.
-సచివాలయానికి మొత్తం 4 ద్వారాలుండగా.. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారు. పడమర వైపు ద్వారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు. ఈశాన్య గేటు నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వస్తారు. ఆగ్నేయ ద్వారం నుంచి సందర్శకులు వస్తారు.
-వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్ను నిర్మించారు.
-సచివాలయానికి ఆగ్నేయంగా గుడి, మసీదు, చర్చిలను నిర్మించారు. వాటి పక్కనే ముందువైపు రిసెప్షన్ హాల్, ఎన్ఆర్ఐ సెంటర్, పబ్లిసిటీ సెల్ పక్కనే మీడియా కోసం గదులు నిర్మించారు.
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.5 ఎకరాలు
ల్యాండ్ సేపింగ్ : 7.72 ఎకరాలు
సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
పార్కింగ్ : 560 కార్లు, 700ల బైక్లు
యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్థుల్లో ఒక్కో దాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 X 300
ప్రధాన గుమ్మటాలు (సైలాంజ్) : 11వ అంతస్థు
ప్రధాన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో నాలుగు సింహాల జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే ఈ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించారు.
సచివాలయ భూగర్భంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని 9 ఎకరాల పచ్చిక బయళ్ల నిర్వహణకు ఈ నీటినే వాడుతారు.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.
ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు
1వ అంతస్థు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖలు
2వ అంతస్థు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖలు
3వ అంతస్థు: మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం
4వ అంతస్థు: ఫారెస్ట్, లా, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు-సాంస్కృతిక శాఖలు
5వ అంతస్థు: ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్థు: సీఎం, సీఎస్, సీఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు
మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.
మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 గంటల మధ్య శిలాఫలకం ఆవిష్కరణ. అనంతరం యాగం పూర్ణాహుతి నిర్వహించి సీఎం చాంబర్లోని తన సీటులో ఆసీనులై సంతకం చేస్తారు.
మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య మంత్రులు, అధికారులు తమతమ సీట్లలో ఆసీనులై సంతకాలు చేస్తారు.
2:15 గంటలకు అధికారులు, సిబ్బంది సభా ప్రాంగణానికి చేరుకొంటారు.
2:15 నుంచి 2:45 గంటల మధ్య అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
2:45 గంటల నుంచి భోజనాలు ఉంటాయి.