Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో/హుజూర్నగర్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై సైబర్క్రైం పోలీసుల దర్యాప్తులో స్పష్టత వస్తుందా? టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కించపరుస్తూ పోస్టులు పెట్టించిన యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్కు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆయన బాస్ ఎవరు? ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి సోషల్ మీడియా వింగ్లను ఏర్పాటు చేశాడు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తమ్కు వ్యతిరేకంగా పోస్టింగ్లు ఎందుకు పెడుతున్నారు? ఆ వ్యవహారం వెనుక ఎవరున్నారన్న దానిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే సీఆర్పీసీలోని సెక్షన్ 41 కింద ప్రశాంత్కు నోటీసులు జారీ చేశారు.
కాంగ్రెస్లో ఒకరిద్దరు ప్రధాన నాయకులకు ప్రశాంత్ వీరవిధేయుడిగా మెలిగినట్టు ఆ పార్టీ లో చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణలో ప్రశాంత్ ఆ నాయకుల పేర్లను చెప్తే వారి కి నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఆ పోస్టులు పెట్టిన బాధ్యత పూర్తిగా తనదేనని ప్రశాంత్ చెప్పవచ్చని కొందరు అంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తమ్ కీలక వ్యా ఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నదెవరో తెలుసని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా బీఆర్ఎస్ నేతలను కలిశానని.. తాను, తన సతీమణి పద్మావతి పార్టీ మారుతున్నట్టు కాంగ్రెస్లోని కొందరు ముఖ్యనేతలే దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
సీనియర్లకు చెక్ పెట్టేందుకు జూనియర్ నాయకులు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నేరుగా ఆరోపణలు చేస్తే అందరికీ తెలిసిపోతుందన్న భావనతో సోషల్ మీడియాపై ఆధారపడ్డారు. సీనియర్లకు వ్యతిరేకంగా ఎక్కడి నుంచి పోస్టింగ్లు పెడుతున్నదీ తెలియకుండా చూసుకునేందుకు ఇతరుల పేర్లతో సిమ్కార్డులు తీసుకుని వాట్సప్కు మాత్రమే వాడుతున్నారు.