హైదరాబాద్, అక్టోబరు 15 (నమస్తే తెలంగాణ): మునుగోడులో వార్ వన్సైడే అని సర్వేలు ఘోషిస్తున్నాయి. ‘మునుగోడు మనదే’ అనే టీఆర్ఎస్ ధీమా అక్షారాలా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రుద్దిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించగా తాజాగా జనంసాక్షి పత్రిక జరిపిన సర్వేలో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించబోతుందని వెల్లడైంది. జనంసాక్షి పత్రిక ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేసింది. రెండో సర్వే ఫలితాలను శనివారం ప్రకటించింది. 49 శాతం ఓట్లు సాధించడం ద్వారా దాదాపుగా సగం ఓటర్ల మద్దతును టీఆర్ఎస్ పొందింది.
బీజేపీ, కాంగ్రెస్లు ఇరు పార్టీల ఓట్ల శాతం కలిపినా కూడా టీఆర్ఎస్తో సమానంగా ఉన్నాయి. గెలుస్తామని మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ 32 శాతం ఓట్ల వద్దే చతికిల పడింది. కాంగ్రెస్ 17 శాతంతో డిపాజిట్ దక్కించుకునే దిశగా ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 3న పోలింగ్ జరగనున్నది. ఈనెల 14న నామినేషన్ల గడువు ముగిసింది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక నిర్వహించిన రెండు సర్వేల్లోనూ టీఆర్ఎస్దే విజయమని జనంసాక్షి తెలిపింది.
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సర్వే నిర్వహించారు. మొదటి సర్వే కంటే రెండో సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. రాజకీయ అఫిలియేషన్ లేకుండా, నీతి, నిజాయితీ, విశ్వసనీయత, నమ్మకానికి సంబంధించిన అంశంగా ఈ సర్వేను తమ సంస్థ చూస్తున్నదని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ తెలిపారు. సర్వేలో అన్ని మండలాల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నివర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించామన్నారు. 5 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించి ఓట్ల శాతాన్ని లెక్కించినట్టు వివరించారు. ఈ నెల 21 నుంచి తుదివిడత సర్వే జరుపుతామని రహమాన్ తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గ ఓటర్లందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. బీసీలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలు విజయం సాధించి పెడతాయని స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలో 59 వేల మందికి రైతుబంధు సాయం అందుతున్నది. 40 వేల మందికి నెలనెలా ఆసరా పింఛను లభిస్తున్నది. ఇలా అన్నివర్గాలకు సాయం చేస్తున్న టీఆర్ఎస్ను గెలిపిస్తామని ఓటర్లు మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.