హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) దేశం విడిచివెళ్లరాదని సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. బీఎల్ సంతోష్ను అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులను ఈ నెల 13 వరకు పొడిగించింది. తాజాగా జగ్గుస్వామి దాఖలు చేసిన వ్యాజ్యం లోనూ అరెస్టు చేయవద్దని సిట్ను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కే సురేందర్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్కు జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించారని సిట్ దర్యాప్తులో తేల్చింది. దీంతో జగ్గుస్వామికి సిట్ 41ఏ కింద నోటీసు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ తరఫున సీనియర్ న్యాయవాది వీ పట్టాభి, గతంలో బీఎల్ సంతోష్ దాఖలు చేసిన రిట్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదించారు.
నోటీసులో పూర్తివివరాలు లేవని పేర్కొన్నారు. సిట్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జే రామచంద్రరావు వాదిస్తూ.. దర్యాప్తు అధికారి సంతృప్తి చెందితే 41ఏ నోటీసు జారీ చేయవచ్చునని చెప్పారు. నోటీసులు అందుకున్న వాళ్లు షరతులకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. నోటీసులోని అంశాలు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. ఆ నమూనాను ఢిల్లీ హైకోర్టు, తర్వాత మద్రాస్ హైకోర్టు కూడా సమర్ధించిందని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు సైతం దానిని పరిగణనలోకి తీసుకున్నదని వివరించారు. నోటీసులో కేసు వివరాలన్నీ చెప్పకర్లేదని, కేసు నంబర్ ఉంటే సరిపోతుందని తెలిపారు. సిట్ దర్యాప్తునకు ఎకడికి రావాలో, ఎప్పుడు రావాలో స్పష్టంగా ఉన్నదని చెప్పారు. బీఎల్ సంతోష్ను అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులను జారీ చేసినప్పుడు.. ఆయన సిట్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. వీరెవరూ చట్టానికి అతీతులు కాదని పేర్కొన్నారు. దర్యాప్తునకు వారంతా సహకరించాలని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.
గొత్తికోయల బహిషరణ తీర్మానం చట్ట వ్యతిరేకం
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గొత్తికోయలను ఛత్తీస్గఢ్కు తిరిగి పంపించేయాలని ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. గుర్రంగూడెంకు చెందిన గొత్తికోయలను బహిషరిస్తూ నవంబర్ 26న గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ, దానిని రద్దు చేసింది. పంచాయతీ తీర్మానాన్ని సవాల్ చేస్తూ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కన్నెగంటి లలిత సోమవారం విచారణ జరిపారు. గత నెల 22న గొత్తికోయలు-అటవీశాఖ అధికారుల మధ్య జరిగిన ఘర్షణలో అటవీ అధికారి శ్రీనివాస్ మృతి చెందారు. పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గొత్తికోయల వైఖరిని వ్యతిరేకిస్తూ వారిని తిరిగి ఛత్తీస్గఢ్కు పంపేయాలని పంచాయతీ తీర్మానం చేసింది.