హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘ఎర్ర గురివింద తన నలుపు ఎరగనట్టు’ అన్నట్టుంది కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తీరు. ఈ బీజేపీ నేత కర్ణాటకలో మంత్రిగా ఉన్నప్పుడు బోలెడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె మాత్రం తెలంగాణకు వచ్చి తగుదునమ్మా అంటూ సుద్దులు చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను మరిచి తెలంగాణ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. ఆమె కర్ణాటకలో విద్యుత్తుశాఖ మంత్రిగా ఉండగా ఏకంగా రూ.28 వేల కోట్ల విద్యుత్ స్కాంలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరో రూ.90 కోట్లకు సంబంధించిన స్కాంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అలాంటి నేపథ్యమున్న నేత అంతా సవ్యంగా నడుస్తున్న తెలంగాణ రాష్ర్టానికి వచ్చి అడ్డగోలు ఆరోపణలు చేశారు.
ఇక్కడ జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా లోకల్ బీజేపీ నేతలు రాసిచ్చిన చవకబారు స్క్రిప్ట్ను అక్షరమక్షరం అప్పజెప్తున్నారు. ఆమెపై అవినీతి ఆరోపణలే కాదు… మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడానికి సంబంధించిన కేసులూ గతంలో నమోదయ్యాయి. తన చరిత్రను తానే మరచినట్టు నటిస్తూ ఎదుటివాళ్ల మీద అభాండాలు వేసేందుకు తెగిస్తున్నారు. తిట్టిపోయడం తప్ప మరేదీ తెలియనట్టు నోరుజారుతున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి అందలాలు ఎక్కాలనుకునే సగటు బీజేపీ నేత తరహాలోనే రెచ్చిపోతున్నారు. ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.