నారాయణపేట : తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడిగాలులతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణులు కూడా తట్టుకోలేక పోతున్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగుతున్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు(sunburn) గురవుతున్నారు. మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
అలాగే, పెరుగుతున్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయ ణపేట జిల్లా(Narayanapet )మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరుతపులి (Leopard died) మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్ష సంపద అంతరిస్తుండటంతో వన్యప్రాణులు తలదాచకునేందుకు నిలువు నీడ లేకుండా పోతున్నది.
దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్వో వీణా వాణి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమిలో కనీసం నాలుగు చిరుతలు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలులతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందిందని డీఎఫ్వో తెలిపారు.