హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డును టీఓటీ విధానంలో ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై ఆంధ్రజ్యోతి మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ‘బాదుడు మారదు’- టోకు ధరల సూచీ ఆధారంగా ప్రైవేటులోనూ ఏటా టోల్ చార్జీల పెంపు అంటూ మరో తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఇది పూర్తిగా నిరాధారమైన కథనమని హెచ్ఎండీఏ అధికారులు అసలు వాస్తవాలను పొందుపరుస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హెచ్ఎండీఏ 2006లో ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టిందని, 2012 నుంచి ఓఆర్ఆర్పై టోల్ వసూలు ప్రారంభించామని తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వం జీ.వో. ఎం.ఎస్.నం.365 (తేదీ 22-09-2012) ప్రకారం భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూపొందించిన టోల్ రుసుములకు అనుగుణంగానే ఓఆర్ఆర్పై ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1 నుంచి టోల్ పెరుగుదల 3 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. టోల్ రూల్స్ 2012 ప్రకారం 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేసేవారికి 50 శాతం తగ్గింపు రేట్లు వర్తింపజేస్తారని చెప్పారు. టీఓటీలో రాయితీ వ్యవధి ప్రసుత్తం అనుసరిస్తున్న పద్ధతిలోనే ఉంటుందని, ఇదే విధానాన్ని ఎన్హెచ్ఏఐ సైతం అనుసరిస్తున్నదని అధికారులు పేర్కొన్నారు. ఓఆర్ఆర్ను వినియోగించే వారి నుంచి ఫిర్యాదులను నమోదు చేయడానికి టోల్ఫ్రీ నంబర్ 14449ను అందుబాటులో ఉంచామని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా హెచ్ఎండీఏ చర్యలు తీసుకొంటుందని వివరించారు. తప్పుడు కథనాలను వండి వారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆంధ్రజ్యోతిని విశ్వసించవద్దని కోరారు.