పాలకుర్తి : సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం లక్ష్మణ్ తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 14.90 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన వసతులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతున్నాయని, సర్కారు బడులలో సకల వసతులు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి మంచి నీళ్లు , వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల కరెంటుతో వ్యవసాయం పెరిగిందని అన్నారు. దీంతో భూముల ధరలు, రైతుల గౌరవం పెరిగిందని తెలిపారు.
మరోవైపు నిరుద్యోగులకు కోసం ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి, మరో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో గ్రామాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠాశాలల్లో వసతులు మెరుగవుతున్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలని సూచించారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లాల్లో రూ. 500 కోట్లతో పెద్ద హాస్పిటల్ , మెడికల్ కాలేజీ ఇస్తున్నారని ఆయన వెల్డించారు. అనంతరం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించనున్న మహా శివరాత్రి పోస్టర్ను మంత్రి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య ,జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యా శాఖ అధికారి కె. రాము, మన ఊరు – మన బడి ప్రత్యేక అధికారి వినోద్ కుమార్, ఎంపీపీ బసవ సావిత్రి , జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.