హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): వచ్చే వానకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంటల బీమా ప్రతిపాదనలను పరిశీలించిన ఆయన, ఎన్నికల సంఘం అనుమతితో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సోమవారం ఆయన పలు రైతు పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తామని, అప్పటివరకు బ్యాంకులు, పీఏసీఎస్ రైతులను రుణాల రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. రైతుభరోసా పథకం వచ్చే వానకాలం నుంచే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల పంటల కొనుగోళ్లను ప్రారంభించిందని తెలిపారు. వానాకాలం సీజన్కు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే వడగండ్ల వానల పంటనష్ట పరిహారం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.