హుస్నాబాద్ టౌన్/చేర్యాల, జూన్ 7: అబద్ధపు పునాదులపై బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. అధికారం కోసమే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవాచేశారు. వడ్లు కొనాలని గగ్గోలు పెట్టిన బండి సంజయ్.. కర్ణాటకలో వడ్లు ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో రూ.1,400కు క్వింటాల్ వడ్లు కొంటే.. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్ రూ.1,960 చెల్లించారని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో విజయవంతంగా వడ్ల కొనుగోలు చేపట్టామని వెల్లడించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ధూళిమిట్ట మండలం కొండాపూర్, మద్దూరు మండలం నర్సాయపల్లి, చేర్యాల మండలంలోని ముస్త్యాల, చేర్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మండలి మాజీ చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. పక్కనే ఉన్న కర్నాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని రైతులు తమ ధాన్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారని.. ఆ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీస మద్దతు ధరతో వడ్లు కొనే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ మాత్రం ఆ పార్టీల నాయకులు బండి సంజయ్, రేవంత్రెడ్డి రైతులను అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేస్తూ పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లర్లను తనిఖీల పేరిట వేధింపులకు గురిచేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు కొనుగోలు పూర్తి చేస్తున్నదని స్పష్టంచేశారు. కర్ణాటకలోని రైతులు తమ రాష్ట్రంలో కంటే క్వింటాల్కు రూ.500 ఎక్కువగా వస్తుండటంతో తెలంగాణలో వడ్లు విక్రయించేందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినప్పటికీ రైతులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. త్వరలో 2,600 వైద్యుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్తోపాటు శనిగరం ప్రాజెక్టు, హుస్నాబాద్ ఎల్లమ్మచెరువుకు సంబంధించిన పనుల ప్రగతిని హరీశ్రావు సమీక్షించారు. ఈ నెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ చేపట్టనున్నట్టు వెల్లడించారు.