హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి కట్టడి కోసం రా్రష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, అన్ని రకాల ప్రజాసమూహాలు, మత, సాంస్కృతిక కార్యకలాపాలపై నిషేధం విధించింది. మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కొవిడ్ ఆంక్షలను ఈ నెల పదో తేదీవరకు పొడిగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఆంక్షలను ఈ నెల రెండు వరకే విధించింది. పలు రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పది వరకు పెంచింది.
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో కొవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. రవాణా, ప్రయాణాల్లో, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, విద్యాలయాలు ఎక్కడైనా మాస్క్ ధరించనివారికి రూ.1000 జరిమానా విధించే విషయంలో రాజీపడొద్దని చెప్పారు. శనివారం డీజీపీసహా ఇతర శాఖల అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలు, కార్యాలయాల్లో నిరంతరం శానిటైజ్ చేయాలని సూచించారు.