హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రోహిణికార్తె ప్రవేశించడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
అత్యధికంగా నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో 46.5 డిగ్రీలు నమోదైందని తెలిపింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాకలో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.4, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.4, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 46.4, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 46.4, ఖమ్మం జిల్లా ఏన్కూర్లో 46.4, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 46.3, పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో 46.3, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 46.2, మహబూబాబాద్ జిల్లా సీరోల్లో 46.1, ములుగు జిల్లా వాజేడులో 46.1, నిర్మల్ జిల్లా నిర్మల్లో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వివరించింది.
నైరుతి రుతుపవనాల రాక జూన్ రెండోవారంలో రాష్ర్టానికి చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వడదెబ్బతో పదులసంఖ్యలో జనం మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.