హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా, రాబోయే రోజుల్లో వానగండం పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 16 నుంచి 23 వరకు వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, ఏప్రిల్ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొన్నది. తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది.