హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్గేట్/నర్సాపూర్(జీ): నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారికి నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించారు. వీరిలో మౌనిక, వినంతి, ఆరాధ్యను నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ పాఠశాలను శనివారం కలెక్టర్ ఆశీష్సంగ్వాన్ తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాంకుపై మూత లేకపోవటంతో వెంటనే ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ ట్యాంకుపైకి వెళ్లి నీటిని పరిశీలించారు. విద్యార్థులు తాగుతున్న మినరల్ వాటర్, వంటకు ఉపయోగించే బోరు వాటర్ను పరీక్షించేందుకు శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీణను ఆదేశించారు.
ముగ్గురు వంట మనుషుల తొలిగింపు
ఫుడ్పాయిజన్ ఘటనకు సంబంధించి సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన జ్యోతి, అనూష, ఉమ సహాయ వంట మనుషులను తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించిన నర్సాపూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు అందజేశారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు కేజీబీవీల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు తాత్కాలికంగా పలువురు అధికారులను నియమించారు.