రయ్..రయ్ అంటూ వందల సంఖ్యలో ఇసుక లారీలు దూసుకొస్తాయి. ఫుల్ లోడ్తో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతాయి. చెక్పోస్టులు, చెకింగ్లు ఏమీ ఉండవు. అలా అని ఆ లారీలకు పర్మిట్లు గట్రా కూడా ఏమీ ఉండవు. ఉండేదల్లా లారీ ముందు అద్దంపై ‘సర్దార్’ అనే పదం.. దాని పక్కనే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫొటో. ఆ రెండే ఈ లారీలకు నేషనల్ పర్మిట్లాంటి లైసెన్సులు. ఎవరైనా అనామక అధికారి ఎప్పుడైనా వాటిని ఆపి చెక్చేస్తే ఇక అంతే.. పై నుంచి ఫోన్ల మీద ఫోన్లు.. ఇదీ ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ‘సర్దార్’ ఇసుక దందా..
CM Revanth | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఒకవైపు సీఎం ప్రకటిస్తుంటే.. మరోవైపు సాక్షాత్తు ఆయన బొమ్మ పెట్టుకొని, లారీలపై ‘సర్దార్’ అని రాసుకొని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు వందలాది ఇసుక లారీలు ఇలా సీఎం రేవంత్రెడ్డి బొమ్మ పెట్టుకొని ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వాలకు చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలో రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఇసుక క్వారీలను చెరబట్టిన వీళ్లు.. తొలుత ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించారు. తర్వాత ఇసుక సరఫరా లేదంటూ ధరలు పెంచారు. అధికారులేమో.. పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, మేం చెప్పిందే నిజం అంటూ తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడేమో సుమారు 70 లారీలు ఆంధ్రప్రదేశ్లోని గుండాల నుంచి ఇసుకలోడ్తో ఖమ్మం జిల్లాలోని సారపాక ప్రాంతానికి వచ్చాయి. వీటిని గమనించిన స్థానికులు ఎస్పీ, కలెక్టర్, మైనింగ్ సహా ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 17 ఇసుక లారీలను భద్రాచలం సమీపంలోని సారపాక క్రాస్రోడ్డు వద్ద పట్టుకున్నారు. మిగిలిన లారీలు అక్కడి నుంచి జారుకున్నాయి. వీటిని స్థానిక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు బూర్గంపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. విచిత్రం ఏమిటంటే.. లారీల్లోని ఒక్క డ్రైవర్ కూడా పట్టుబడలేదు. అందరూ పరారయ్యారు.
ఇసుక లారీలను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించిన వెంటనే రంగంలోకి దిగిన ఓ మంత్రి పీఏ, అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. సదరు పీఏ సీఎం కార్యాలయం సూచన మేరకు మంత్రి వద్ద పనిచేస్తున్నారని తెలిసింది. ఆయన బుధవారం ఉదయం నుంచి అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నారని సమాచారం. అయితే, విషయం అప్పటికే బయటకు రావడం, మీడియాలో కూడా రావడంతో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. మంత్రి పేషీ నుంచి ఫోన్లు వచ్చిన విషయం కూడా బయటకు పొక్కింది. దీంతో సదరు మంత్రి ‘జాగ్రత్త’గా డీల్ చేయాలని, లేదంటే పరువు పోతుందని చెప్పి ఆయనను మీడియా కంటక పడకుండా ఉండాలని చెప్పినట్టు తెలిసింది. మేడారం జాతర బిజీలో ఉన్నానని, తర్వాత విపులంగా మాట్లాడుదామని ఆ మంత్రి పీఏతో చెప్పినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా తర్వాత, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక డంప్ ఉన్నట్టు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రోజూ వంద నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. గడిచిన 12 రోజులుగా ఈ దందా కొనసాగుతున్నదని విశ్వసనీయ సమాచారం. ప్రతీరోజూ ఈ తరహాలో ఇసుకను తరలించడం వల్ల ఇసుక కాంట్రాక్టర్లకు ఖర్చులన్నీ పోను రూ.కోటి వరకు మిగులుతున్నట్టు సమాచారం. అంటే 12 రోజుల్లో వీళ్లు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకతో రూ.12 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు తెలుస్తున్నది.
ఇసుక లారీల్లో పరిమితికి మించి ఇసుకను సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఒక లారీలో 30-35 టన్నుల ఇసుకను నింపుతుంటారు. కానీ, ఆంధ్ర నుంచి వచ్చే వాటిల్లో ఒక్కొక్క లారీలో 45-50 టన్నుల ఇసుకను నింపుతున్నారు. ఒక్కో లోడ్ను తెలంగాణలో రూ.లక్ష నుంచి రూ.లక్షా 20 వేలకు అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఓవర్లోడ్తో వచ్చే లారీలను అనుమతించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనివెనుక అతిపెద్ద ముఠా పనిచేస్తున్నదని సమాచారం. గతంలో ఆంధ్ర ప్రాంతంలో పనిచేసిన ఓ అధికారి ఇప్పుడు తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయన కనుసన్నాల్లోనే అంతా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలను ఏర్పాటుచేసి ఇలాంటి అక్రమ ఇసుక రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం భిన్నంగా జరుగుతున్నది. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, ధరలపై గతంలోనే ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించింది. అయితే, అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా ఉండదని కొట్టిపారేశారు. కానీ, సారపాక వద్ద పెద్దఎత్తున అక్రమ ఇసుక దొరకడంతో అధికారుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది.
రేవంత్ రెడ్డి ఫొటోతో సర్దార్ అని అద్దాలపై రాసి ఉన్న లారీలను అధికారులు పట్టుకోవడంతో కొంతమంది డ్రైవర్లు అప్పటికప్పుడు లారీ అద్దాలను సైతం పగులగొట్టారు. మీడియా ప్రతినిధులు వచ్చి ఫొటోలు తీయబోతుండగానే అద్దాలు పగులగొట్టి పరారవ్వడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని ముఖ్యమైన ఇసుక ర్యాంపులను మూసివేయడం అనుమానాలకు తావిస్తున్నది. కరీంనగర్, మణుగూరు, నిజామాబాద్ తదితర చోట్ల క్వారీలను బంద్ పెట్టారు. దీనికి రాజకీయ కారణాలున్నాయని చెప్తున్నారు. టీఎస్ఎండీసీ పాత్రను తక్కువ చేయడం, వినియోగదారులకు టీఎస్ఎండీసీ నుంచి ఇసుక అందకుండా చేయటంలో మతలబు ఏమిటన్న ప్రశ్న వస్తున్నది.
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవాళ్లు బాజాప్తా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను తమ లారీ ముందు భాగంలోనే పెయింట్ చేయించుకోవడం, దాని పక్కనే సర్దార్ అని రాయించుకోవడం గమనార్హం. సీఎం ఫొటో ఉన్న లారీతోపాటు వచ్చే వాహనాలను సరిహద్దుల్లో ఆపవద్దని రాష్ట్రంలోని ఓ కీలక అధికారి మౌకిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. రేవంత్రెడ్డి ఫొటో ఐడియా కూడా ఆ అధికారే ఇచ్చినట్టు తెలిసింది. సీఎం ఫొటోను, సర్కార్ అని లారీపై బాజాప్తా రాయించి మరీ ఇసుకను తరలిస్తున్నారంటే ఏదో మతలబు ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 17 లారీలను పట్టుకొంటే ఒక్క డ్రైవర్ కూడా దొరక్కపోవటం కూడా విచిత్రంగా ఉన్నది.