Manukota | మహబూబాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు రాత్రికి రాత్రే వాగులో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా జిల్లాకేంద్రంతోపాటు తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ వంటి ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు.
జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్నాయక్ అధికారులకు పదేపదే సూచనలిస్తున్నప్పటికీ తవ్వకాలకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట, కొమ్ములవంచ, జయపురం గ్రామ శివారులో ఉన్న వాగులో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు తవ్వకాలు జరిపి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు.
ఇదే మండలంలో గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఇసుక డంపులు సీజ్ చేసి వేలం వేశారు. ఇప్పుడు మాత్రం అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. చిన్నగూడూరు, మరిపెడ, డోర్నకల్, బయ్యారం మండలాల్లోని వాగు ల నుంచి కూడా ఇసుక అక్రమంగా తరలిపోతున్నది. ముల్కలపల్లిలోని ఆకేరువాగు నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వందలాది ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న విషయం తెలిసీ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు నిఘాపెట్టి అక్రమార్కుల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు.