హైదరాబాద్/రవీంద్రభారతి జనవరి 22 (నమస్తే తెలంగాణ): ‘సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. క్యూబాపై విధించిన చట్ట విరుద్ధమైన ఆర్థిక దిగ్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’ అని చే గువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా పిలుపునిచ్చారు. డాక్టర్ అలైదా, చే మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా ఆదివారం హైదరాబాద్ నగర పర్యటనలో భాగంగా నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన క్యూబా సంఘీభావ సభలో పాల్గొన్నారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరికి ఎన్సీఎస్సీ కోఆర్డినేటర్లు, సీపీఐ, ప్రజాసంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హిమాయత్నగర్లో సీపీఐ కార్యాలయమైన మగ్దుంభవన్లో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో డాక్టర్ అలైదా గువేరా ప్రసంగిస్తూ ఆర్థిక దిగ్బంధం లేకపోతే క్యూబా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రజలతో పరస్పర సంబంధాల కోసం చే గువేరా స్వచ్ఛంద సేవలో కూడా పాల్గొనే వారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు క్యూబాకు మద్దతు పలికాలని అన్నారు. క్యూబాలో లాగానే మనదేశంలో కూడా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కొన్ని శక్తులు పూనుకుంటున్నాయని, అలాంటి శక్తులపై కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క, ప్రజాయుద్ధనౌక గద్దర్, పీవోడబ్ల్యూ సంధ్య పాల్గొన్నారు.
మగ్దూంభవన్లోకి ఎర్రతివాచీపై ఆహ్వానం
హైదరాబాద్ పర్యటనలో ఉన్న చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, ఆయన మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన హిమాయత్నగర్ మగ్దూంభవన్ను సందర్శించారు. కార్యాలయ ప్రవేశద్వారం నుంచి లోపలి వరకు వారికి ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానం పలికారు. ఇరువైపులా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు రెడ్ సెల్యూట్ చే గువేరా.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆహ్వానించారు. ప్రవేశద్వారం వద్ద జగద్గిరిగుట్టకు చెందిన శ్రీ సంఘమిత్ర పాఠశాల విద్యార్థినులు సంప్రదాయరీతిలో అలైదా గువేరాను ఆహ్వానించారు.
విద్యార్థినులతో అలైదా గువేరా ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం అలైదా గువేరా పరిచయ కార్యక్రమానికి నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా కో-ఆర్డినేటర్లు ఎన్ బాలమల్లేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా మాట్లాడుతూ చే నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తే ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. ఇక్కడకు రావడం సంతోషమని, హైదరాబాద్ ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని సంతృప్తి వ్యక్తం చేశారు.
చే గువేరా పేరు చిరస్మరణీయం : కూనంనేని
సూర్యచంద్రులు ఉన్నంత వరకు చే గువేరా పేరు ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మగ్దుంభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే విప్లవ వీరుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారని కొనియాడారు. చే గువేరా పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తున్నదని తెలిపారు. ఎప్పటికైనా కమ్యూనిజం అజేయంగా నిలుస్తున్నదని అన్నారు. చేగువేరా కూతురు ఇక్కడికి రావడం అభినందనీయమని కొనియాడారు. చే గువేరా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యువత స్ఫూర్తి పొందారని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాప్రెడ్డి, నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్సీఎస్సీ) కో-ఆర్డినేటర్లు డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.