సంగారెడ్డి, జూలై 2(నమస్తే తెలంగాణ): ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకొన్న ఐఐటీయన్లు ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఐఐటీ హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రిసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించారు. తర్వాత బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఐఐటీ హైదరాబాద్ ఆడిటోరియంలో కేంద్రమంత్రి సమక్షంలో ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఐఐటీ హైదరాబాద్ కలిసి పనిచేయాలన్న ఎంవోయూపై ఇఫ్లూ వీసీ సురేశ్కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్ట్టెయినబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు కోసం గ్రీన్కో సంస్థ ప్రతినిధి అనిల్కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ కీలకపాత్ర పోషించనున్నట్టు చెప్పారు. ఇందులో ఐఐటీల భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని తెలిపారు. పరిశ్రమలతో కలిసి ఐఐటీ హైదరాబాద్ ప్రపంచస్థాయి స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. పరిశోధనలు,ఆవిష్కరణలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉన్నట్టు చెప్పారు.