హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): ఐఐటీ రూర్కీకి చెందిన మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ (ఎంయూఆర్పీ) కోర్సు విద్యార్థులు సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొన్న నిర్ణయాలు, మౌలిక సదుపాయాలు, హౌసింగ్, శానిటేషన్, రవాణా సౌకర్యాలపై విద్యార్థులకు అర్వింద్ కుమార్ వివరించారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ నుంచి అర్బన్ ప్లానర్స్.. తమ అభిప్రాయాలను, పలు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. వాటర్బోర్డు, జీహెచ్ఎంసీ, హౌసింగ్ శాఖల అధికారులతో కూడా భేటీ కావాలని చెప్పారు. దీంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లను, జవహర్నగర్ డంప్యార్డ్ను పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు.