కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్ చంద్రశేఖర్
ఐఐటీహెచ్లో టెక్నాలజీ రిసెర్చ్ పార్క్ ప్రారంభం
సంగారెడ్డి, ఫిబ్రవరి 5 : హైదరాబాద్ చాలా శక్తివంతమైన ప్రాంతంగా ఎదుగుతున్నదని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ కొనియాడారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో రూ.75 కోట్ల తో ఏర్పాటుచేసిన టెక్నాలజీ రిసెర్చ్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడు తూ.. ఐఐటీలు దేశంలోనే అగ్రగామి సాంకేతిక సంస్థలుగా ఉన్నాయని అయితే ఐఐటీ హైదరాబాద్ మా త్రం అసాధారణమైనదని ప్రశంసించారు. ఐఐటీ విద్యార్థులు, దేశంలోని యువత కేవలం ఉద్యోగులుగానే స్థిరపడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ(జికా) ప్రతినిధి సైటో మిత్సునోరి మా ట్లాడుతూ.. ఐఐటీహెచ్లో సుజుకీ మోటార్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెంటర్ ఇరుదేశాల్లో సాంకేతిక అభివృద్ధికి దోహదం చేస్తున్నదని చెప్పారు. ఐఐటీహెచ్ పూర్వ విద్యార్థులు టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలతో తమదైన ముద్రవేస్తున్నారని జపాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి షింగో మియామోటో కొనియాడారు. ఇక్కడి విద్యార్థులు జపాన్ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఐఐటీ హైదరాబాద్లో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీబీఆర్ మోహన్రెడ్డి కోరారు. కొత్తగా నెలకొల్పిన టెక్నాలజీ రీసెర్చ్ పార్కు ద్వారా మానవాళికి అవసరమైన నూతన ఆవిష్కరణలకు తీసుకొస్తామని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు కేవీఎల్ సుబ్రహ్మణ్యం, సీహెచ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.