సంగారెడ్డి మే 26 (నమస్తే తెలంగాణ): జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు నావికాదళం, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్ నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్.. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో కో-డెవలప్మెంట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
నేవీ వైస్ అడ్మిరల్ సందీప్ నైతానీ ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేవీకి అవసరమైన ఆయుధాల తయారీకి నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఐఐటీహెచ్, నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కలిసి పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.