హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ (Iftar) విందు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇఫ్తార్ ఏర్పాట్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పండుగ సంర్భంగా ముస్లిం సోదరులు నెల రోజులపాటు ఉపవాస దీక్ష చేస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాసులు ఇస్తున్నామని వెల్లడించారు.
ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం స్టేడియం పరిసరాల్లో ఆరు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం తరఫున దుస్తులను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నామని తెలిపారు.