హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): జంతువులు, పక్షులను పెంచుకోవడమంటే చాలా మందికి ఇష్టం. మరికొంత మందికి అదో వ్యాపకం. అయితే, వీటిని పెంచుకొనేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో వన్యప్రాణుల వేట ఒకటే కాదు..కొన్ని జంతువులు, పక్షులను పెంచడం కూడా నేరం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ) ప్రకారం వన్యప్రాణులను స్వేచ్ఛగా తిరగకుండా ఓ చోట బందీ చేయడం నేరం. దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఆగస్టు 21న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అంతరించిపోతున్న అడవి మొకలు, జంతువులు, పక్షులను వేటాడటం కానీ, హింసించడం కానీ, గాయపర్చడం లేదా నాశనం చేయడం, శరీర భాగాల్ని తీసుకోవడం నేరం. సరీసృపాలు, పక్షుల గూళ్లను కదల్చడం, నాశనం చేయడం కూడా శిక్షార్హమే. కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుకోవడం కూడా నేరం. వన్యప్రాణి సంరక్షణ సంస్థ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పారులు, వన్యప్రాణి కేంద్రాల సరిహద్దులను మార్చకూడదు.
వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఆరు షెడ్యూళ్లు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ) ప్రకారం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఆరు షెడ్యూల్స్ను పొందుపరిచారు. ఇందులో ఏ జంతువులు, పక్షులను పెంచితే, వేటాడితే శిక్షార్హమో తెలియజేశారు. అలాగే, సాగు నిషేధం ఉన్న మొక్కలను చేర్చారు. జాతీయ పక్షి -నెమలి, జాతీయ జంతువు- పులి, పెద్ద పులులు, సింహంలాంటి క్రూర జంతువులే కాదు..కొన్ని సాధు జంతువులను కూడా పెంచుకోకూడదని ఈ చట్టం స్పష్టం చేస్తున్నది. తాబేళ్లను పెంచుకోవచ్చు కానీ..నక్షత్ర తాబేలు (ఇండియన్ స్టార్), సముద్రపు తాబేలు (రెడ్ ఇయర్డ్ ైస్లెడర్) లాంటి రకాలను పెంచుకోకూడదు.
సముద్ర జీవులను వాటి నివాస స్థావరాల నుంచి తీసుకొచ్చి..అక్వేరియం లేదా పాత్రల్లో పెంచడం నేరం. చిలుకల్లో ఓ రకమైన ప్యారకీట్స్, కోయిలలు, పాలపిట్ట, మునియాలాంటివాటిని పెంచడం నేరం. వినోదం కోసం కోతులను పెంచడం లేదా శిక్షణ ఇవ్వడం కూడా నేరంగా పరిగణిస్తారు. అందుకే జంతువులు, పక్షులను పెంచుకోవాలనుకొన్నప్పుడు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి తెలుసుకోవడం మంచిదని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు, జంతు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.