జగిత్యాల : కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే. ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలేదని దాని వెనుక సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఎంతో ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వార్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ బుధవారం పెగడపల్లి మండలంలోని రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టే విధంగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాముకాట్లకో, మిత్తీల పాట్లకో తన ప్రాంత రైతుబిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతుంటే.. వారిని ఎట్లా బతికించుకోవాల్నా అని మథనపడిన కేసీఆర్ మదిలోంచి పుట్టిందే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకం అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.