రేగొండ, మార్చి 27: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లెలో మాజీ ఎమ్మెల్యే గండ్ర ఎండిన పంట పొ లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏడాది పొడవునా బీఆర్ఎస్ ప్రభుత్వం డీబీఎం 38 కాల్వల ద్వారా సాగునీరు అందించినట్టు చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క రోజు కూడా సాగునీరు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. రూ.రెండు లక్షల రుణ మాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజలైనా రుణమాఫీ ఊసేలేదని విమర్శించారు. ఈయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు లెంకల రాజిరెడ్డి, సామాల పాపిరెడ్డి, ఈర్ల సదానందం, సూర నర్సింగరావు, గోపు భిక్షపతి, దగ్గు వెంకటేశ్వర్రావు, బండి రమేశ్ తదితరులు ఉన్నారు.