నిర్మల్, మార్చి 24: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టబోయే ఆందోళనలు, భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులు, కార్యకర్తల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేంద్రంలోని బీజేపీప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా, మండల స్థాయి రైతుబంధు సమన్వయ సమితి, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్, డిసిసిబీ, డీసీఎంస్, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయాలని చెప్పారు. అందరిని సమన్వయపరుస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. యాసంగిలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ ఫాలసీని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరస సెగలు ఢిల్లీని తాకేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.