నీలగిరి, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై రైతులను జాగృత పరచడానికి ఈనెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామని, అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే తొకుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలపై వారు తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని ఆదివారం వారు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. శ్రీశైలం సొరంగ మార్గాన్ని సంవత్సరాల తరబడి పని జరిగే విధంగా ఒప్పందం చేసుకున్నది కాంగ్రెస్ పార్టేనని గుర్తుచేశారు. అప్పుడు పూర్తి చేయకుండా ఇప్పుడు ఆ తప్పును కేసీఆర్ మీదకు నెట్టడమేమిటని ప్రశ్నించారు. కోమటిరెడ్డి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన జనం ఆయన్ను చీదరించుకొనే రోజు దగ్గరలోనే ఉన్నదని తెలిపారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నల్లగొండను అభివృద్ధి చేయలేపోయిన కోమటిరెడ్డి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ను విమర్శిస్తున్నాడని ప్రశ్నించారు. మెడికల్ కాలేజ్, ఐటీ టవర్, నాగార్జున కళాశాల పునర్నిర్మాణం, విశాలమైన రోడ్లు ఇలా రూ.1,300 కోట్లు వెచ్చించి కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. ఇకనైనా మాయమాటలు, మోసపు చేతలు మానుకుని నల్లగొండ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.