హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన తీరు ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే లాగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఎవరైనా దొంగలు, హంతకులు కూడా దేవుని ఎదుట అబద్ధపు ప్రమాణం చేస్తే వారి నేరం మాసిపోతుందా? అని ప్రశ్నించారు. మీకు చేతనైతే ఎంఎల్ఏల కొనుగోలుపై సుప్రీం కోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వివిధ రాష్ట్రాలలో ఎంఎల్ఏలను కొనుగోలు చేసి ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూల్చిన బీజేపీ జాతీయ నేతలతో బండి సంజయ్ అదే విధంగా ప్రమాణం చేయించగలరా? అని సవాలు విసిరారు. మతమనేది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమనిఅన్నారు. దానిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టాలను , నిబంధనలను ఉల్లంఘించిన వారిని విచారించేందుకు, శిక్షించేందుకు న్యాయ వ్యవస్థ ఉన్నదని తెలిపారు. చట్టానికి, విశ్వాసానికి కూడా బండి సంజయ్ తేడా తెలియనట్లుగా ఉన్నదని విమర్శించారు. విద్వేష ప్రసంగాలను సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టు ఇప్పటికీ మార్గదర్శకాలు ఇచ్చిందని, దేవుళ్లను, మందిరాలు, మఠాలను ముందుపెట్టి మాట్లాడే వారికి ఇది వర్తింపజేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.
ఎంఎల్ఏల బేరసారాలు జరిపిన మఠాధిపతులు తమ బాటలోకి వచ్చిన వారికి ఈడీ, సీబీఐ వేధింపులు ఉండవని చెప్పడం ద్వారా వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును బలపరిచినట్లయిందని కూనంనేని పేర్కొన్నారు.