హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్కడ మంత్రి కేటీఆర్ను ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వల్ ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ, కేంద్రం మధ్య సరైన సంబంధాలు లేవన్న అంశాన్ని ఆయన ప్రశ్నించారు. దానిపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. ఒకవేళ తెలంగాణ తరహాలో మిగితా రాష్ట్రాలన్నీ పరిపాలన సాగిస్తే, మన దేశం ఎప్పుడో 5 ట్రలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేదని అన్నారు.
#Exclusive | "If the rest of India performed as well as Telangana did, we would have been a 5 trillion economy already..": Telangana Minister, @KTRoffice #ITVideo #IndiaTodayAtDavos @rahulkanwal pic.twitter.com/vgG8d35o15
— IndiaToday (@IndiaToday) January 18, 2023
దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రోత్ రేటు(సీఏజీఆర్) 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే, తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదన్నారు.
మోదీ ఈ దేశ ప్రధాని కావడానికి ముందు భారత దేశ అప్పు 56 లక్షల కోట్లు ఉండేదని, కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ అప్పు విపరీతంగా పెరిగిందన్నారు. గత 8 ఏళ్ల పాలనలో.. అంటే మోదీ పరిపాలనలో దేశం కొత్తగా వంద లక్షల కోట్లు అప్పుల పాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీజీ ఒక్కరే ఆ అప్పుకు కారణమైనట్లు తెలిపారు. ఎఫ్ఆర్బీఎం యాక్ట్ లోని మార్గదర్శకాల తాము పాటిస్తున్నామని కేటీఆర్ అన్నారు.
గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు 3 లక్షల 68 వేల కోట్లు సమర్పించిందని, కానీ తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం లక్షా 68 వేల కోట్లే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తమకు వచ్చిన దాని కన్నా ఎక్కువే కేంద్రానికి సమర్పించిందని ఆయన వెల్లడించారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై చెబుతున్న అంకెలు అవాస్తవమని మంత్రి కేటీఆర్ అన్నారు. అత్యధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తమకు సూచనలు చేయడం జోక్ అవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర సర్కార్ నెగటివ్ ఆలోచనలు, హానికరమైన భావనల వల్ల దేశ వృద్ధి కుంటుపడుతుందని కేటీఆర్ తెలిపారు.