ముషీరాబాద్, మార్చి 22: ఉన్నత స్థాయి కమిటీని నియమించి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీలపై స్పష్టత వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, కరుణశ్రీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టుల సంఖ్యను తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రూప్-1 సర్వీసెస్లో 1,600 పోస్టులకు 503, గ్రూప్-2లో 2,200కు గాను 783, గ్రూప్-3లో 3 వేలకు బదులు 1,383, గ్రూప్-4లో 8,500, 25 వేల టీచర్ పోస్టులకు బదులు 11 వేలకే నోటిఫికేషన్ ఇచ్చి అరకొర నియామకాలతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్టు రిక్రూట్మెంట్ ఖాళీలను లెక్కించడంతో సరిగా వ్యవహరించడం లేదని, ఖాళీలను తక్కువగా చూపుతున్నారని మండిపడ్డారు.