హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): గాంధీ సరోవర్ పేరిట తమ ఇండ్లను కూల్చొద్దని అంటూ మధు పార్క్ రిడ్జ్లోని 450 కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతుండగా.. అదే అపార్ట్మెంట్లో నివాసముండే ఆర్టిస్ట్ ఎంవీ రమణారెడ్డి మాత్రం ఆ ప్రాజెక్టును తనకు అప్పగిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పడంతో అపార్ట్మెంట్ నివాసులంతా అవాక్కవుతున్నారు. ఏండ్ల తరబడిగా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇండ్లు కట్టుకుంటే రమణారెడ్డి మాత్రం ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టు కోసం పరితపిస్తున్నాడని మండిపడుతున్నారు.
తాను, తన సతీమణి ఇటీవల మీడియాతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు రమణారెడ్డి సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం తనకు అప్పగిస్తే దేశంలోనే అత్యద్భుతంగా నిలిచేలా కడతానని, ప్రపంచమే ఆశ్చర్యపోయేలా విగ్రహాన్ని డిజైన్ చేస్తానని తెలిపారు. అయితే ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. ఇండ్లు పోతున్నాయనే బాధలో 450 కుటుంబాలు తిండి, నిద్ర లేక రోదిస్తుంటే రమణారెడ్డి అవేమీ పట్టించుకోకుండా తన స్వప్రయోజనాలను చూసుకోవడం చర్చనీయాంశమైంది.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రమణారెడ్డి సతీమణి అనితారెడ్డి ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రమణారెడ్డి మాత్రం ఆమె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అది ఆమె అభిప్రాయం వ్యక్తిగతమని చెప్పారు. కష్టపడి కట్టుకొన్న ఇల్లు కోల్పోతానన్న ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉం టారని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును దక్కించుకునేందుకే రమణారెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, మీడియాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం ఇంత దిగజారుతారా? అంటూ పోస్టులు పెడుతున్నారు.