కమలాపూర్, ఆగస్టు 13: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకే లాభమని, టీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఒకడు కావాలా?, జనం కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీ కావాలో? ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఖాసింపల్లిలో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్కు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశమిస్తే ఆస్తులు పెంచుకుని ముఖ్యమంత్రి సీటుపై కన్నేశాడన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ముస్లింలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.