రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర రైతాంగం పట్ట చిత్తశుద్ధి ఉంటే పంట పొలాలకు నీళ్లందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ (Congress) ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ వీర్నపల్లి మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో నేడు నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా హామీలు 420 ఉన్నాయని ఆరోపించారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనను, పదేండ్ల కేసీఆర్ (KCR) పాలనను ప్రజలు బేరిజు వేసుకుంటున్నారని వెల్లడించారు. కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే ఏదో రకంగా తమకు నీళ్లను అందించేవారని ప్రజలు నేడు భావిస్తున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత తొందరగా రిపేర్ చేసి రైతులకు నీళ్ల అందించేవారని అన్నారు. కరీంనగర్లో బండిసంజయ్కు బుద్ధి చెప్పాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి (BRS Candidate) వినోద్ కుమార్(Vinod Kumar) ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన సంజయ్ ఒక్క రూపాయి కేంద్రం నుంచి తీసుకురాలేదని ఆరోపించారు. రైతులకు రూ. 500 ఇస్తామన్న బోనస్ ఎన్నికలు కోడ్ రాకముందే జీవోను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈనెల 12న కరీంనగర్లో నిర్వహిస్తున్న కథన భేరి కి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.