Etela Rajender | ఆత్మకూరు(ఎం)/ యాదగిరిగుట్ట/ మోటకొండూరు/ నాగారం, మోత్కూరు: ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటామని సవాలు విసిరారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట, మోటకొండూరు, సూర్యాపేట జిల్లా నాగారం, మోత్కూరు మండలాల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరో 20ఏండ్ల వరకు కేంద్రంలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతుందని విమర్శించారు. రైతు రుణమాఫీ ఏమాయే.. రైతుబంధు ఎటుపోయే.. మహిళలకు 2500 రూపాయలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటి వరకూ ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యంకాని హామీ అన్నారు. కేసీఆర్ మీద కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేశారు తప్ప.. ప్రేమతో కాదని స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే మంత్రులను, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.