Harish Rao | తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు.. బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడామని గుర్తుచేశారు. మన పార్టీ స్థానం మారిందని.. పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చామని అధైర్యపడొద్దని నాయకులకు ధైర్యం చెప్పారు. మనం ఉద్యమ వీరులం.. కార్యశూరులమని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చిన చరిత్ర బీజేపీది అని విమర్శించారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదని అన్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుబట్టారని గుర్తు చేశారు. ఢిల్లీలో, గల్లీలో ఎవరున్నా పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలేనని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి అయ్యాక కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లిచ్చిన హామీలు అమలవుతాయని అన్నారు. తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్కర్నూల్ స్థానం గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టంచేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని హరీశ్రావు అభిప్రాయపడ్డారు. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్లు అవసరమవుతాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ను మించి హామీలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు కాకమ్మ కథలు చెబుతున్నారని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేత్తులేసిందని తెలిపారు. కేంద్రం మెడలు వంచేదిపోయి.. ఢిల్లీలో బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మైత్రిని బండి సంజయ్ బహిరంగంగానే ఒప్పుకున్నారని హరీశ్రావు తెలిపారు. అసెంబ్లీ ఫలితాలను ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదామని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని అన్నారు.