ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. నాకు సంబంధం లేదని, చీట్ చేస్తున్నారని బాధితురాలు గట్టిగానే మాట్లాడింది. మీరు ఆగండి.. మీ పేరు ఫలానా! మీరు ఉండేది హైదరాబాద్లో, కావాలంటే మీ ఆధార్ కార్డ్ను పంపిస్తామంటూ ఆమె సెల్ఫోన్కు ఆధార్కార్డును పంపించారు. ఆధార్కార్డును చూసి షాక్ అయిన బాధితురాలు ఏదో పొరపాటు జరిగిందని, కాపాడాలని వేడుకొన్నది. రూ.20 లక్షలు డిమాండ్ చేయటంతో, భయంతో వారి బ్యాంక్ ఖాతాలకు పంపింది. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
Aadhar | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆధారే అన్నింటికీ ఆధారం. సాధారణ మనిషిని ఉగ్రవాదిగా, ఉగ్రవాదిని సాధారణ పౌరుడిగా చూపించవచ్చు. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు. దేశ సంపదనూ దోచేయొచ్చు. అలాంటి ఆధార్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా కొన్ని చోట్ల జరిగే అలసత్వంతో ఆధార్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. దాంతో ప్రజలను మోసం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డాటా అనేది అన్ని అవసరాలకు ప్రధానం. చిరు వ్యాపారం నుంచి కార్పొరేట్ వ్యాపారం వరకు అత్యంత ప్రభావితమైందీ డాటా.
డాటా చోరీపైనే గతంలో సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ, ఇతర నగరాల్లో దాడులు చేసి, దేశవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది డాటా చోరీకి గురయ్యిందని తెలిపారు. ఈ డాటాతోనే సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కోటి మందికిపైగా ప్రజాపాలన లబ్ధిదారుల డాటా కూడా అమ్మకానికి వెళ్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.