హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ రూల్స్-పేరా 9 (ఏ) రూల్ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు స్పష్టం చేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్ మరో వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇతర ఉద్యోగాలకు కూడా విడతల వారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించారు. అయితే, కొందరు అభ్యర్థులు విద్యార్హతలు, స్థానికతకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశమున్నట్టు టీఎస్పీఎస్సీ దృష్టికి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లకు ఎక్కువ ఆస్కారం ఉన్నదని, ఇప్పటికే ఇలాంటివి అత్యధికంగా జరుగుతున్నాయని తెలిసింది. మూతబడ్డ స్కూళ్లు, కొన్ని ప్రైవేట్ స్కూళ్ల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు. స్థానికేతరులు ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రమాదం ఉన్నదని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఫేక్ సర్టిఫికెట్ల ఘటనలు గతంలో చోటుచేసుకోవటంతో కమిషన్ సభ్యులు అప్రమత్తమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను టీఎస్పీఎస్సీయే చేపట్టినా, అనుమానాలున్న సర్టిఫికెట్ల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
టీఆర్టీలో జరిగిందిలా..
గతంలో ఫేక్ సర్టిఫికెట్లతో బురిడీ కొట్టించబోయి నలుగురు అభ్యర్థులు డిబార్ అయ్యారు. టీఆర్టీ హిందీ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించి, మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించగా, 1754201864, 1754204298, 1754204963, 1754205458 హాల్టికెట్ నంబర్లు గల అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యర్థులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు తేలడంతో నోటీసులు జారీ చేసి, డిబార్ చేశారు.