జనగామ : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శివలింగయ్యను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అవసరమైన దవాఖానలు నిర్మించడంతో పాటు.. సుశిక్షితులైన వైద్యాధికారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు జరుగుతుందన్నారు.
జనగామలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీలో భాగంగా రేపటి కేబినెట్ సమావేశంలో అమోదం లభిస్తుందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనువైన స్థలాన్ని సేకరించాలన్నారు. జనగామ-సిద్దిపేట మార్గంలో స్థలాన్ని పరిశీలించారు.