హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను 3 నెలల్లో భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం జిల్లాలవారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులను ఎంపికచేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కొవిడ్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 430 మంది ఆర్టీసీ కార్మికులు మృతిచెందారు. వీరు కాకుండా డ్యూటీలో ఉండి మరణించినవారు, ఆరోగ్య సమస్యలతో మృతిచెందినవారు, మెడికల్ అన్ఫిట్ అయినవారు కలిపి మరో 600 ఖాళీలను అధికారులు గుర్తించారు. ఈ 1,030 ఖాళీలను కారుణ్య నియామకాలతో భర్తీ చేసేందుకు మూడు ప్రాధమ్యాలను ఎంచుకొన్నారు. ఆన్డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించినవారి కుటుంబాలకు రెండో ప్రాధాన్యంగా, మెడికల్ అన్ఫిట్ అయినవారికి మూడో ప్రాధాన్యంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయోపరిమితిని రెండేండ్లు పెంచడంతో ఆర్టీసీలో రెండేండ్లపాటు రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. రెండేండ్ల అనంతరం 2021 డిసెంబర్ నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. గత నెల(జూలై)లో దాదాపు 160 మంది రిటైర్ అయ్యారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి మరో 3 నెలల సమయం పడుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
4 రకాల పోస్టులకే కారుణ్య నియామకాలు
టీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, శ్రామిక్ల పోస్టులను మాత్రమే కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులదారుల అర్హతను బట్టి ఈ 4 రకాల ఉద్యోగాల్లో దేనికి సరిపోతే అక్కడ నియమించనున్నారు. హెవీ లైసెన్స్లు ఉన్నవారికి డ్రైవర్, పదో తరగతి పాసైన వారికి కండక్టర్ లేదా సెక్యూరిటీ గార్డు, ఐటీఐ చేసిన వారికి శ్రామిక్ పోస్టులు ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే దరఖాస్తు దారుల్లో చాలా మంది యువత సెక్యూరిటీ గార్డు పోస్టులకే ఆసక్తి చూపుతున్నారని, అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఖాళీలు, సంస్థ అవసరాన్ని బట్టే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పదో తరగతి పూర్తిచేయనివారు సైతం ఉన్నట్టు తమ దృష్టి వచ్చిందని, అలాంటి వారు తగిన విద్యార్హతలను సాధించేందుకు 10 ఏండ్ల వరకు సమయం ఇచ్చామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
వీఆర్ఎస్కు 522 దరఖాస్తులు
స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవాలనుకొంటున్న కార్మికులు, ఉద్యోగుల నుంచి టీఎస్ ఆర్టీసీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గత నెల 20న మొదలైన ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ 31తో ముగిసింది. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 99 డిపోల నుంచి 522 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొన్నారు. వీరంతా నెలరోజులపాటు నోటీస్ పీరియడ్లో ఉంటారని, ఆ తర్వాత వారి రిటైర్మెంట్ తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.