హైదరాబాద్, మే8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2017 నుంచి 2020 వరకు మూండేండ్లలో తెలంగాణలోని పలు జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 9,129మంది మృతిచెందినట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గుర్తించింది. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా రహదారులపై ఎక్కడెక్కడ తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయో పరిశీలించారు. రాష్ట్రంలోని 25 జాతీయ రహదారుల్లో 336 బ్లాక్స్పాట్లు ఉన్నట్లు భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) అధికారులు గుర్తించారు. ఒక రహదారిపై ఒకేచోట 500మీటర్ల పరిధిలో మూడేండ్లలో కనీసం పది ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని బ్లాక్స్పాట్గా పరిగణిస్తారు.
అత్యధికంగా హైదరాబాద్ నుంచి వికారాబాద్, పరిగి మీదుగా వెళ్లే 163 జాతీయ రహదారిపై 33 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాల నివారణకు రూ.680 కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. రహదారులను సరిచేయడం, మలుపులను తగ్గించడం, ఇంజినీరింగ్ లోపాలను నివారించడం, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. ప్రతిపాదనల ఆధారంగా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తెలంగాణకు నిధులు కేటాయించే అవకాశముంది.