హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గుర్తింపు లేని స్కూళ్లను కట్టడిచేయడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. వాటిలో విద్యార్థులు చేరకుండా ఆపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. గుర్తింపు పొంది న పాఠశాలల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల వివరాలను ఇందులో పొందుపరచనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతితో 11, 151 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 28.65 లక్షల మంది విద్యార్థులున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా రాష్ట్ర విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలను ఈ వెబ్సైట్లో అం దుబాటులో ఉంచనున్నారు. తాము చేరే పాఠ శాలకు గుర్తింపు ఉన్నదో లేదో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకొనే వీలుంటుందని, దీంతో గుర్తిపు లేని స్కూళ్లను కట్టడిచేయవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
నేపథ్యమిది
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న బంజారాహిల్స్ బీఎస్డీ- డీఏవీ స్కూల్ వ్యవహారంలో గుర్తింపులేని విషయం బయటిపడింది. ఈ స్కూల్కు 5వ తరగతి వరకే అనుమతులున్నా.. 7వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. లైంగిక వేధింపుల ఘటన బయటపడటంతో పూర్తిగా విచారణ చేపటారు. అధికారుల విచారణలో 6,7 తరగతులకు అనుమతి లేదన్న విషయం బయపడింది. అవాక్కయిన విద్యాశాఖ అధికారులు ఇలా చాలా పాఠశాలలు నడుస్తున్నట్టు అనుమానించి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి బీఎస్డీ -డీఏవీ స్కూల్పై చర్యలు తీసుకోనున్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
పుట్టగొడుగుల్లా ప్రీస్కూళ్లు
ఇటీవల కొత్త ప్రైవేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో కరోనా ప్రభావం లేకపోవడంతో పలు యాజమాన్యాలు ప్లే, కిండర్గార్డన్ స్కూళ్లను తెరిచాయి. 1-10 వరకు ఫీజులతో పోల్చితే నర్సరీలోనే అధిక ఫీజులు ఉండటం, పైగా రెండేండ్లుగా 3-5 ఏండ్ల లోపువారంతా స్కూళ్లకెళ్లకపోవడంతో తమకు కలిసివస్తుందన్న ఆశతో వీటినే తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేలకుపైగా స్కూళ్లు ఉన్నట్టు అంచనా. తాజా కసరత్తుతో ఆయా స్కూళ్లన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదా ఆయా స్కూళ్లు గుర్తింపు కోసం ప్రయత్నిస్తాయని అధికారులు భావిస్త్నురు. గుర్తింపును పునరుద్ధరించుకోనివి కాకుండా.. కొత్తగా స్కూల్ను తెరిచేందుకు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోకుండా నడుస్తున్నవాటిని మాత్రమే గుర్తింపు లేని పాఠశాలలుగా పరిగణనలోకి తీసుకుంటామని ఓ అధికారి వెల్లడించారు.