ఆమనగల్లు, డిసెంబర్ 15: సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటల సాగుతో భారీ లాభాలు సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొత్తబ్రాహ్మణపల్లికి చెందిన ఆదర్శ రైతు ఆరోగ్యరెడ్డి. మార్కెట్కు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలపై అవగాహన పెంచుకొన్న ఆయన.. కాలాన్ని బట్టి విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు. 9 ఎకరాల్లో పత్తి, 2.20 ఎకరాల్లో కుసుమలు, 3 ఎకరాల్లో నువ్వులు, కందులు, పెసర్లు, మినుమలు, అరెకరంలో శెనగలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే 9 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటతో 50 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఏటా వాణిజ్య పంటల సాగులో రూ.3 లక్షల పెట్టుబడి పోగా, రూ.7 లక్షల లాభం పొందుతున్నారు. తోటి రైతులకు సాగులో సలహాలు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడూ వరి వేసి భూమిని పాడుచేసుకోవద్దని, పంట మార్పిడి పద్ధతితో మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు కూడా ఆరోగ్యరెడ్డి సాగు విధానం నచ్చి మరింత ప్రోత్సహిస్తున్నారు.
ప్రతి ఏటా పంట మార్పిడి చేస్తూ పత్తి, శెనగలు, నువ్వులు, కందులు, కుసుమలు పండిస్తున్నా. రెండు, మూడు ఎకరాల్లో అంతర పంటలు కూడా వేస్తున్నా. నీటి సమస్య రాకుండా బిందు సేద్యం చేస్తున్నా. పంటల సాగు విధానాన్ని గుర్తించి అధికారులు నన్ను ఆదర్శ రైతుగా ఎంపిక చేశారు.
-రైతు ఆరోగ్య రెడ్డి, ఫోన్ నంబర్: 9908371511