Obesity disease | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఫాస్ట్ఫుడ్ సంస్కృతి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయి ఊబకాయం, మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లపై ఇక్రిశాట్ అధ్యయనం చేసింది.ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కార్బొహైడ్రేట్ల వినియోగం పెరిగి, పోషకాహారం తీసుకోవడం తగ్గిందని తెలిపింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రొటీన్ రిచ్ ఫుడ్కు ప్రాధాన్యమిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలోని అన్ని గ్రామాలను శాంపిల్గా తీసుకొని కార్బొహైడ్రేట్లు, షుగర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాల వినియోగంపై అధ్యయనం చేశారు.
పెరిగిన కార్బొహైడ్రేట్ల వాడకం
ఈ అధ్యయనంలో వారు ఆహారంలో పోషకాహార సమతుల్యత లోపించడానికి గల కారణాలను గుర్తించారు. శరీరానికి అందించాల్సిన పోషకాలపై అవగాహన లేకపోవడంతోపాటు, ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం ఖరీదైనది కావడంతో కేవలం అధిక చక్కెర, పిండిపదార్థాలు ఉండే సాధారణ బియ్యంతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఖరీదైన పండ్ల కంటే పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ షుగర్ ఫుడ్స్ను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. జొన్నల కంటే బియ్యం తక్కువ ధరలో ఉండటంతో అన్నం ఎక్కువగా తింటున్నట్టు పేర్కొన్నారు. ఒకప్పుడు స్థానికంగా సమృద్ధిగా ఉండే వృక్ష సంపద తరిగిపోయిందని, దీంతో సహజంగా దొరికే ఎన్నో రకాల పండ్లు, ఆకులు, దుంపలను కోల్పోయామని, పలు గ్రామల ప్రజలు వెల్లడించినట్టుగా ఇక్రిశాట్ తన నివేదికలో పేర్కొంది.
దేవరకద్ర, ఆమన్గల్లో పెరుగుతున్న ఒబేసిటీ
సాధారణ, సంప్రదాయ ఆహారపు అలవాట్లతోనే గ్రామాల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కార్బొహైడ్రేట్లు పరిమితికి మించి తీసుకోవడంతోనే అధిక బరువు పెరుగుతున్నారని, దీంతో పోషకాహారలోపం ఏర్పడి పలు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆమన్గల్, దేవరకద్ర, దోకూర్, ఓరెపల్లితో వంటి ప్రాంతాల్లో ఊబకాయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. అయితే పట్టణాలకు వలసలు పోవడంతో కొంతమందిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయని, పోషకాహారానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని తేలింది. స్థానికంగా దొరికే ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం కూడా కార్బొహైడ్రేట్ల వినియోగం పెరిగేందుకు కారణమైందని తేల్చారు.